CM Sri A. Revanth Reddy participated in the launch of the Indira Soura Giri Jala Vikasam scheme.

సోలార్ విద్యుత్ ఆధారిత వ్యవసాయం చేసే నియోజకవర్గంగా అచ్చంపేటను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. రోబోయే వంద రోజుల్లో ఈ నియోజకవర్గంలో రైతులందరికీ వంద శాతం సబ్సిడీతో సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి గారు లాంఛనంగా ప్రారంభించారు. అక్కడే స్ప్రింక్లర్ డ్రిప్‌ను స్విచ్ ఆన్ చేశారు. ఈ ప్రతిష్టాత్మక పథక ఉద్దేశాన్ని వివరిస్తూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర రాజనర్సింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, జూపల్లి కృష్ణారావు గారు, ధనసరి సీతక్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, ప్రణాళికా మండలి వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారితో కలిసి ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రారంభించారు.
దేశానికే ఒక మాడల్‌గా, గిరిజన రైతుల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకం పైలట్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి గారు 29 మంది పోడు భూముల రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ, కీలక విషయాలను చెప్పారు. అక్కడికక్కడే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.
 నియోజకవర్గంలో వచ్చే వంద రోజుల్లో రైతులందరికీ సోలార్ విద్యుత్ పంపుసెట్లను అమర్చాలి.
 ఉత్పత్తి చేసే సోలార్ విద్యుత్‌ను వ్యవసాయానికి, గృహావసరాలకు వినియోగించగా కొంత మిగులు ఉండేలా, ఆ మిగులు విద్యుత్‌ను ప్రభుత్వ గ్రిడ్‌కు అనుసంధానం చేసే విధంగా ఉండే ప్యానెల్స్ ఏర్పాటు చేయాలి.
 మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం ద్వారా నెలకు 3 నుంచి 5 వేల రూపాయల మేరకు ఆదాయం లభించాలి.
ఈ గ్రామంలో ప్రారంభించిన ఈ పథకం నియోజకవర్గం మొత్తంలో విస్తరించడంతో పాటు ఈ పథకంపై లబ్దిదారులకు అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి.
 ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలి. వచ్చే సంవత్సరం ఇదే రోజు మరోసారి పర్యటించి ఇక్కడ ప్రారంభించిన ఇందిర సౌర గిరి జల వికాసం పురోగతిని పరిశీలిస్తా.
 ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులో భూమి లేని చెంచుల విషయాన్ని ప్రత్యేకంగా పరిశీలించి పది రోజుల్లోగా అందరికీ ఇండ్లు కేటాయిస్తాం.
 ఈ కార్యక్రమంలో లోక్‌సభ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు, పోరిక బలరాం నాయక్ గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారితో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.