Hon’ble Chief Minister Sri A. Revanth Reddy Speaks at The Hindu Huddle 2026: India in Dialogue by The Hindu in Bengaluru.

“మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా యువత ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలి. ఆయా రంగాల్లో స్కిల్స్ Skills పెంచుకుంటే అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఏఐ కారణంగా వైట్ కాలర్ జాబ్‌లు పోతున్నాయని అందరూ ఆందోళన చెందుతున్నారు. వైట్ కాలర్ జాబ్‌ల‌కు ప్రత్యామ్నాయం బ్లూ కాలర్ జాబ్స్. యువతరం వాటిపై దృష్టి సారించాలి. అందుకు అవసరమైన స్కిల్స్ పెంచుకోవాలి” అని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

✅ ది హిందూ #TheHindu దినపత్రిక బెంగుళూరులో నిర్వహించిన ది హిందూ హడిల్ చర్చా గోష్ఠిలో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. ది హిందూ డైరెక్టర్ ఎన్. రామ్ గారు అడిగిన తెలంగాణ అభివృద్ధి ప్రణాళికలు, రాజకీయ, సామాజిక, పరిపాలనా, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అనేక ప్రశ్నలకు ముఖ్యమంత్రి గారు విడమరిచి చెప్పారు.

✅ ఏఐ వల్ల ఉద్యోగాలు పోతున్నాయని ఆందోళనకర పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా యువతలో నైపుణ్యం పెంచడానికి తెలంగాణలో అనేక చర్యలు తీసుకున్నట్టు వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పాత పాత సిలబస్‌తో మూస పద్ధతిలో కొనసాగుతున్న ఐటీఐలను అత్యాధునిక టెక్నాలజీ సెంటర్లు (ATC)లుగా అప్ గ్రేడ్ చేసిన విషయాలను చెప్పారు.

✅ తెలంగాణ సమగ్రాభివృద్ధికి రూపొందించిన తెలంగాణ రైజింగ్-2047 దార్శనికత, 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా రాష్ట్రం ఎదగడానికి నిర్దేశించుకున్న భవిష్యత్తు ప్రణాళికలను వివరించారు. ప్రధానంగా రైతులు, యువత, మహిళల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్ర భవిష్యత్తు రోడ్ మ్యాప్‌పై చర్చాగోష్టిలో సమగ్రంగా తెలిపారు.

✅ “నిరుద్యోగ యువత ప్రాధాన్యతగా అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ పున‌రావాస కేంద్రంగా ఉండ‌కూడ‌దని భావించి యూపీఎస్సీ ఛైర్మ‌న్‌, ఇత‌ర స‌భ్యుల‌ను క‌లిసి చ‌ర్చించా. యూపీఎస్సీ ఎలా ప‌ని చేస్తుందో తెలుసుకున్నాం. ఎటువంటి వివాదాలు లేకుండా నియామ‌క ప్ర‌క్రియ ఎలా చేప‌డ‌తారో తెలుసుకున్నా. దాన్ని టీజీపీఎస్సీలో అమ‌లు చేసి 15 నెల‌ల్లో మేం 67,760 ఉద్యోగాలు భర్తీ చేశాం.

✅ దేశంలోనే అత్యధిక సంఖ్య‌లో ఉద్యోగాలు ఇచ్చాం. రెండు వారాల కిందట కూడా నోటిఫికేష‌న్లు ఇచ్చాం. త్వ‌ర‌లోనే 5 వేల పోలీసు ఉద్యోగ నియామ‌కాల నోటిఫికేష‌న్ ఇవ్వ‌బోతున్నాం అని వెల్లడించారు.

రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పులు. గతంలో మహారాష్ట్ర, తర్వాత తెలంగాణలో ఎక్కువ సంఖ్యలో రైతులు ఆత్మహత్యలు జరిగేవి. నేను అధికారంలోకి వ‌చ్చిన తర్వాత 25,035 రైతు కుటుంబాల‌కు చెందిన రూ.20,616 కోట్ల రుణాల‌ను మాఫీ చేశా. ఇది దేశంలోనే అత్య‌ధిక రుణ‌మాఫీ.

✅ 2024-25 సంవ‌త్స‌రంలో రైతు ఆత్మ‌హ‌త్య‌లు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ఎన్‌సీఆర్‌బీ కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. రైతులు ఇప్ప‌టి వ‌ర‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర (MSP) కోసం పోరాడారు.. నేను ఎమ్మార్పీ ఇవ్వ‌డంతో పాటు ధాన్యం రైతుల‌కు క్వింటాలుకు రూ. 500 బోన‌స్ ఇచ్చాను.

✅ ధాన్యం సేక‌ర‌ణ‌ను కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఎమ్మార్పీ ప్ర‌క‌టించి చేతులు దులుపుకోవడం సరికాదు. తెలంగాణలో ధాన్యం, మొక్క‌జొన్న‌తో పాటు ఇత‌ర పంట‌లు సేక‌రిస్తున్నాం. రైతు భ‌రోసా కింద ఎక‌రాకు రూ.12 వేలు ఇస్తున్నాం.. వాటిని రైతులు ఎరువులు, పెట్టుబ‌డికి ఉప‌యోగిస్తున్నారు.

✅ మ‌హిళా సాధికారిత‌కు మేం చేస్తున్న కృషిలో భాగంగా తెలంగాణ‌లోని స్వ‌యం సహాయ‌క సంఘాల్లోని 67 ల‌క్ష‌ల మంది మ‌హిళ‌లకు సున్నా వ‌డ్డీతో 60 వేల కోట్ల రుణాలు తీసుకున్నారు. ఆ వ‌డ్డీల‌ను మేం క‌డుతున్నాం. మ‌హిళా సంఘాలు 1000 బ‌స్సులు కొనుగోలు చేశారు.

✅ పున‌రుత్పాద‌క ఇంధ‌న రంగంలోకి మా మ‌హిళా సంఘాలు వ‌చ్చాయి. వాళ్ల‌కు పెట్రోల్ బంక్‌లు ఇచ్చాం. సోలార్ ప్లాంట్లు ఇచ్చాం. ప్ర‌తి ప్ర‌భుత్వ సంస్థ వ‌ద్ద మా మ‌హిళా సంఘాల స‌భ్యులు క్యాంటీన్లు న‌డుపుతున్నారు. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో వ‌స‌తుల క‌ల్ప‌న మ‌హిళా సంఘాలకు అప్ప‌గించాం. వాళ్లు సంతోషంగా ఉన్నారు.

✅ తెలంగాణ‌ అభివృద్ధికి సంబంధించి మాకు సమ‌గ్ర‌మైన ప్ర‌ణాళిక ఉంది. 160 కిలోమీట‌ర్ల ఔట‌ర్ రింగు రోడ్డు ప‌రిధిలోని న‌గ‌ర ప్రాంతాన్ని క్యూర్ (కోర్ అర్బ‌న్ రీజియ‌న్ ఎకానమీ), ఓఆర్ఆర్‌ నుంచి త్రిబుల్ ఆర్ (రీజినల్ రింగ్ రోడ్డు) మ‌ధ్య ప్రాంతాన్ని ప్యూర్ (పెరీ అర్బ‌న్ రీజియ‌న్ ఎకాన‌మీ), ఆర్ఆర్ఆర్ వెలుప‌ల ప్రాంతాన్ని రేర్ (రూర‌ల్ అగ్రిక‌ల్చ‌రల్ రీజియ‌న్ ఎకాన‌మీ) గా వర్గీకరించి ఆ విధమైన ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం.

✅ గ‌తేడాది డిసెంబ‌రు 7, 8, 9 గ్లోబ‌ల్ సమ్మిట్ నిర్వ‌హించాం. పాల‌సీ డాక్యుమెంట్ విడుద‌ల చేశాం. క్యూర్‌లో స‌ర్వీస్‌, ప్యూర్‌లో మ్యానుఫ్యాక్చ‌ర్‌, రేర్‌లో అగ్రికల్చ‌ర్‌కు ప్రాధాన్యం ఇస్తున్నాం. క్యూర్‌ను నెట్ జీరో సిటీగా మార్చ‌నున్నాం. పాల‌సీకి త‌గిన‌ట్లు ప్ర‌ణాళిక అమ‌లు చేస్తున్నాం. ఏడాదికి రూ. 2000 కోట్లు న‌ష్ట‌పోతున్నా మేం క్యూర్ ప‌రిధిలో ఈవీ వాహ‌నాల‌నే వాడాల‌ని నిర్ణ‌యించాం. అందుకోసం ఈవీ వాహ‌నాల‌పై ట్యాక్స్ ఎత్తివేశాం. మెట్రో విస్త‌ర‌ణ చేప‌డుతున్నాం.

✅ హైదరాబాద్‌లో చెరువుల ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించి వాటి పున‌రుద్ధ‌ర‌ణ చేప‌డుతున్నాం. వాట‌ర్ హార్వెస్టింగ్ వెల్స్ నిర్మిస్తున్నాం. ప్యూర్ పరిధిలో మ్యానుఫాక్చ‌ర్ రంగాన్ని ప్రోత్స‌హిస్తున్నాం. మేం 30 వేల ఎక‌రాల్లో భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీని నిర్మిస్తున్నాం. ఇక్క‌డ ఫార్చూన్ -500 కంపెనీలు పెట్టుబ‌డులు పెట్టేలా ఆహ్వానిస్తున్నాం.

✅ తెలంగాణ పొరుగు రాష్ట్రాలతో పోటీ పడటం లేదని, చైనా, జపాన్, సౌత్ కొరియా, జర్మనీల పురోగతి గమనించిన తర్వాత వాటితో పోటీపడుతున్నాం. పెట్టుబడులకు చైనా+1 గమ్యస్థానాల గురించి ఆలోచన వచ్చినప్పుడు తెలంగాణ పోటీపడుతోంది.

✅ నేను ఎవ‌రి ద‌గ్గ‌రైనా సరే నేర్చుకోవ‌డానికి ఇబ్బంది ప‌డ‌ను. సాగునీటి ప్రాజెక్టు ద‌గ్గ‌ర‌కు వెళితే అసిస్టెంట్ ఇంజినీర్ ద‌గ్గ‌ర నుంచి తెలుసుకోవ‌డానికి కూడా మోహ‌మాటప‌డ‌ను. ఎందుకంటే ఆయ‌నకే అస‌లైన స‌మ‌స్య తెలుసు. దానిని ఎలా ప‌రిష్క‌రించాలో తెలుసు. త్వ‌ర‌లోనే నేను చైనా సంద‌ర్శిస్తా. నేను నేర్చుకుంటా. హార్వ‌ర్డ్‌లో ప‌ది రోజులు కోర్సు చేశా. చైనాను సంద‌ర్శించి ఉత్త‌మ‌మైన ప‌ద్ధ‌తుల‌ను తెలుసుకుంటా.

✅ నేను 2006 నుంచి 2023 వ‌ర‌కు 17 ఏళ్లు ప్ర‌తిప‌క్షంలో ఉన్న సమయంలో ఎంతో తెలుసుకున్నా. ప్ర‌జా స‌మ‌స్య‌పై పోరాడా. అందుకే న‌న్ను త‌ప్పుదోవ ప‌ట్టించలేరు. చిన్న రైతు, నిర‌క్ష‌రాస్యులు సైతం త‌మ ద‌గ్గ‌ర ఉన్న స‌మాచారంతో త‌న కామ‌న్‌సెన్స్‌తో ప‌రిష్కారం చూపుతారు. ప‌రిపాల‌న‌లో కామ‌న్ సెన్స్ అతి ముఖ్య‌మైన అంశం. మీడియాలో వచ్చే వార్తలు బ్యాక్ ఆఫీస్ సమాచారంగా చూస్తా.

✅ గ‌తంలో రాష్ట్రాన్ని పాలించే అవ‌కాశం వ‌చ్చిన వారు పాల‌కులుగా భావించారు. నేను సేవ చేయ‌డానికి వ‌చ్చిన ప్ర‌జా ప్ర‌తినిధిగా భావించా. సామాన్యుల స‌మ‌స్య‌లు ఏమిటో అర్థం చేసుకున్నాను. ప్ర‌త్యేకించి యువ‌త‌, రైతు కూలీలు, మ‌హిళ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకున్నా.

✅ నా రాజ‌కీయ జీవిత‌మంతా ప్ర‌జ‌లు, సామాన్యుల కోసం పోరాడా. నాకు ఎటువంటి రాజ‌కీయ నేప‌థ్యం లేదు. ఎటువంటి మ‌ద్ద‌తు లేదు. నేను వ్య‌వ‌సాయ కుటుంబం నుంచి వ‌చ్చా. మాది వ్య‌వ‌సాయ కుటుంబం. తెలంగాణ ప్ర‌జ‌ల ఆశీర్వాదంతో ఈ స్థాయికి వ‌చ్చా” అని ముఖ్యమంత్రి గారు వివరించారు.

The Hon’ble Chief Minister participated in The Hindu Huddle, a discussion forum organized by The Hindu newspaper in Bengaluru. Responding to a wide range of questions posed by The Hindu Director, N. Ram, the Chief Minister elaborated on Telangana’s development plans as well as various political, social, administrative, and personal issues.