స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల ఉద్యమ పోరాటాలు, ఎందరో అమరుల త్యాగాల చరిత్రను స్మరిస్తూ, తెలంగాణను అభివృద్ధి చేసుకుని ప్రపంచానికే గేట్వేగా నిలబెట్టాలన్న స్వప్నం కోసం మనమంతా పునరంకితమవుదామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం #TelanganFormationDay సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యమంత్రి గారు పాల్గొన్నారు. భద్రతా దళాల కవాతు, పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
✅ తెలంగాణ అమరవీరుల త్యాగాలు, వారు ప్రదర్శించిన తెగువను స్మరించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని రంగాల్లో ప్రగతిని సాధిస్తూ తెలంగాణ సమ్మిళిత, సమగ్రాభివృద్ధికి ప్రజాప్రభుత్వం తీసుకున్న సంకల్పం, నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనలో ప్రజల అండదండలు, సహకారం ఉండాలని కోరారు.
✅ డిసెంబర్ 7, 2023 న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్థంగా, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా, పేదరికం నిర్మూలనే ప్రాధాన్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని అందుకు స్ఫూర్తిగా “పుట్టుక నీది.. చావు నీది, బతుకంతా దేశానిది” అన్న ప్రజా కవి కాళోజీ గారి మాటలను ఉటంకించారు.
✅ స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్ గారికి, ఆనాటి యూపీఏ చైర్ పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపారు.
✅ దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలు చేస్తున్నామని, రైతులు, యువత, ఆడబిడ్డల ఆకాంక్షలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద వర్గాల సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి సాధన కోసం గడిచిన రెండున్నరేళ్లుగా అమలు చేస్తున్న పథకాలను ప్రస్తావించారు.
✅ తెలంగాణ రైజింగ్ -2047 దార్శనికత, రాష్ట్రం మొత్తానికి ఒకే మాస్టర్ ప్లాన్ రూపొందించడం దేశంలో ఎక్కడా లేదని, తెలంగాణను క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) గా రాష్ట్రాన్ని వర్గీకరించి మూడంచెల అభివృద్ధి వ్యూహాన్ని అనుసరిస్తున్నామని ఆ ప్రణాళికను వివరించారు.
✅ “ప్రణాళిక లేని ప్రయాణం గమ్యం చేరదు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత మన దశ – దిశ ఏమిటన్న స్పష్టత లేదు. నలుగురు వ్యక్తుల ఆలోచనలే రాష్ట్ర భవిష్యత్ అన్నట్టుగా నాటి పరిస్థితి ఉండింది. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేధావుల మధనంతో తెలంగాణకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశాం.
✅ తెలంగాణకు అత్యంత కీలక ఆధారమైన వ్యవసాయం. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అనుబంధ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకంతో వరి, మొక్కజొన్న, పత్తి పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది.
✅ తెలంగాణ రైతులు కార్యసాధకులు కావాలంటే అప్పులేని పరిస్థితి ఉండాలన్న ఒకేసారి రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేయడమే కాకుండా గడిచిన రెండున్నరేళ్లలో వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి రూ. 1 లక్షా 56 వేల 496 కోట్లు ఖర్చు చేశాంమని చెప్పారు. దళారుల బారిన పడి మోసపోకూడదని, రైతులు పండించిన పంటలకు కనీస మద్దతు ధర చెల్లిస్తూ, ఎంత భారమైనా సరే, చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని చెప్పారు.
✅ తెలంగాణ నీటి కోసం దశాబ్దాలు గోస పడింది. పదేళ్ల గత పాలనలో సైతం పరిస్థితులు మారలేదు. కృష్ణా, గోదావరి జలాల్లో మన వాటాలు తేల్చి, ప్రాజెక్టులు పూర్తి చేసే విషయంలో ప్రజాప్రభుత్వం చిత్త శుద్ధితో ఉంది. ఈ విషయంలో రాజీ లేకుండా, లౌక్యంతో, రాజకీయ విజ్ఞతతో పని చేస్తాం. తెలంగాణకు వర ప్రదాయని ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తున్నాం.
✅ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో చేపట్టిన వినూత్న కార్యక్రమాలు ఫలితంగా మహిళా సంఘాలు ఇప్పుడు ఆర్థిక శక్తి కేంద్రాలుగా, ఆడబిడ్డలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే క్షేత్రాలుగా తయారవుతున్నాయి.
✅ ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలోని ఆడబిడ్డలు దాదాపు రూ.10 వేల కోట్లు ఆదా చేసుకోగలిగారు. ఇది నాకు ఎంతో సంతృప్తినిచ్చిన పథకం.
✅ మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలోని 42.90 లక్షల కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53.09 లక్షల పేదల గృహాలకు 200 యూనిట్ల ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం.
✅ యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువుల భర్తీ చేశాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంస్కరణలు చేపట్టి రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాం. నోటిఫికేషన్ల జారీ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది.
✅ విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని విశ్వసిస్తున్నాను. తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం, విద్యార్థులకు నైపుణ్యం, పాఠశాలల్లో అత్యన్నత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా పని చేస్తున్నాం.
✅ ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తెచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ-ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం.
✅ ఇది నా ఇల్లు అని పేదవాడు ధైర్యంగా, ఆత్మగౌరవంగా బతికే పరిస్థితి తెస్తున్నాం. అందుకే మొదటి ఏడాదే రూ.22 వేల 500 కోట్లు కేటాయించి, 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. గత ఏడాది ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభించుకున్నాం. కేవలం 13 నెలల కాలంలోనే రాష్ట్రంలో లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయింది. సెప్టెంబర్ 17వ తేదీ ప్రజాపాలన దినోత్సవం నాటికి మిగతా రెండు లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం.
✅ పేదవాడికి సొంతిల్లు ఆత్మగౌరవం ఐతే, రేషన్ కార్డు ఆహార భద్రత. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల 12 వేల కొత్త కార్డులను జారీ చేశాం. ప్రస్తుత రేషన్ కార్డుల్లో 19 లక్షల 44 వేల కొత్త సభ్యుల పేర్లను చేర్చాం. తద్వారా రాష్ట్రంలో 3 కోట్ల 38 వేల మంది ఈరోజు సన్న బియ్యం భోజనం చేయగలుగే పరిస్థితి కల్పించాం.
✅ రాష్ట్రంలో పనిచేస్తున్న దాదాపు 4 లక్షల మంది గిగ్ వర్కర్ల ఉద్యోగాలకు, జీవితాలకు ఇన్నాళ్ళూ భద్రత లేదు. వారి ఉద్యోగ భద్రత కోసం ఒక చట్టం చేశాం. ఇందులో రాహుల్ గాంధీ గారి చొరవకు నేను అభినందనలు తెలుపుతున్నాను.
✅ అమరవీరులు, పోరాటయోధులే తెలంగాణ రాష్ట్రం. వారి త్యాగాలకు విలువలేని రాష్ట్రం జీవం లేని శరీరం లాంటిదని నేను భావిస్తాను. అందుకే తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన యోధులను గుర్తించి, వారికి, వారి కుటుంబాలకు తగిన న్యాయం చేయాలన్న లక్ష్యంతో ఇటీవలే శ్రీ కె.కేశవరావు, శ్రీ కోదండరాం గారి నాయకత్వంలో అధికారికంగా ఒక కమిటీని నియమించాం. కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ పోరాట యోధులందరినీ సముచిత రీతిన సత్కరించి, వారిపట్ల మా చిత్తశుద్ధిని చాటుకుంటాం.
✅ పదేళ్లుగా నిలిచిపోయిన సినిమా అవార్డులను తిరిగి ప్రారంభించుకున్నాం. మన సంస్కృతికి, మన అస్తిత్వానికి చిహ్నమైన ప్రజా గాయకుడు గద్దరన్న పేరుతో ఈ అవార్డులను ఇవ్వడం ద్వారా తెలంగాణ చరిత్రను, సంస్కృతిని సుసంపన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం.
✅ దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల గణన సర్వేను తెలంగాణ ప్రభుత్వం విజయవంతంగా చేపట్టింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న జన గణనకు రాష్ట్రంలో చేపట్టిన సర్వే రోల్ మోడల్గా నిలిచిందని గర్వంగా ప్రకటిస్తున్నాను.
✅ ప్రభుత్వ ఉద్యోగులు మాకు కుటుంబ సభ్యులతో సమానం. వారి కష్ట నష్టాలు మాకు తెలుసు. పదేళ్లుగా పేరుకుపోయిన వారి సమస్యలు మాకు తెలుసు. వాళ్లపై నిఘా, నిరంకుశ వైఖరి ఎలా సాగిందో మేం చూశాం. వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో ఉన్నాం.
✅ ఉద్యోగులకు కోటి రూపాయలతో ప్రత్యేక బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. వారికి ఆరోగ్య భద్రత, సామాజిక భద్రతను కల్పించే ఈ పథకం దేశ చరిత్రలోనే ఇదే మొదటిదని చెప్పేందుకు సంతోషిస్తున్నాను. ఎంప్లాయిస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య పథకం (EHS) అమలు చేయబోతున్నాం.
✅ గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్ని క్యూర్ గా ప్రపంచ స్థాయి సర్వీసెస్ హబ్గా తీర్చిదిద్దుతున్నాం. మున్సిపల్, పోలీసు విభాగాలను పునర్వవస్థీకరించాం. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఔటర్ రింగు రోడ్డు బయటకు తరలించేందుకు హిల్ట్ పాలసీ తీసుకువచ్చాం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈవీలకు లైఫ్ టాక్స్తో పాటు రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్డు టాక్స్లలో మినహాయింపు ఇస్తున్నాం.
✅ హైదరాబాద్ నగరంలో కబ్జాలకు గురైన చెరువులు, కుంటలను కాపాడటానికి, వాటిని పునరుద్ధరించే బాధ్యతను హైడ్రాకు అప్పగించాం. ఇప్పటివరకు దాదాపు రూ. 60 వేల కోట్ల విలువైన 1045 ఎకరాలకు పైగా ఆక్రమణ, కబ్జాల నుంచి భూములను తిరిగి స్వాధీనం చేసుకున్నాం. ఇవి ఇకపై ప్రజల ఆస్తి.
✅ కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వం తన ఆస్తులను అమ్ముకోవడమే తప్ప కొత్త ఆస్తులను సృష్టించింది లేదు. ప్రజా ప్రభుత్వం ఆ పద్ధతికి స్వస్తి చెప్పింది. ప్రతిష్ఠాత్మక హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును ఎల్ అండ్ టీ నుంచి కొనుగోలు చేసి, ప్రజల ఆస్తిగా మార్చాం. ఫోర్త్ సిటీ నిర్మాణం, నగర విస్తరణ, పెరుగుతున్న ట్రాఫిక్, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఫేజ్ 2 లో ఏడు కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించే ప్రతిపాదనలతో తయారు చేసిన డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించాం.
✅ హైదరాబాద్ స్వచ్ఛమైన, పర్యావరణహితమైన నగరంగా ఉండాలి. అప్పడే ప్రపంచానికి ఆదర్శంగా మనం నిలబడే అవకాశం ఉంటుంది. ఆ దిశగా చేసిన ఆలోచనే మూసీ ప్రక్షాళన.
✅ 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఏర్పాటు చేస్తున్నాం. శంషాబాద్ను బుల్లెట్ రైలు కేంద్రంగా అభివృద్ధి చేయటం ద్వారా రీజనల్ కనెక్టివిటీ బలోపేతం అవుతుంది.
✅ దేశంలోనే కాదు. ప్రపంచానికే తెలంగాణను గేట్వేగా నిలబెట్టాలన్నది నా స్వప్నం. దానికి మార్గం తెలంగాణ రైజింగ్ – 2047 దార్శనిక పత్రం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణ ఎదగాలన్నది ప్రజా ప్రభుత్వ సంకల్పం. దానికి ప్రజల అండదండలు కావాలి. మీ అందరి సహకారం. ఆశీర్వాదంతో ఈ లక్ష్యాన్ని చేరుకుంటామన్న విశ్వాసం నాకు ఉంది. అని ముఖ్యమంత్రి గారు ముగించారు.
జై హింద్! జై తెలంగాణ!





