ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు.

ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. నిత్యావసరాలు, కూరగాయలు, పండ్లు, పాలు అన్నీ కల్తీ అవుతుండటంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం (TGFADCA) పై ఎంసీహెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించారు.

✅ ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లు త్వరగా మగ్గేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వినియోగిస్తుండటంతో ప్రజల ఆరోగ్యంపై ప్రభావం పడుతోందని ముఖ్యమంత్రి గారు తెలిపారు.

✅ ఎరువులు, పురుగు మందుల అధిక వినియోగంతో పంట ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు బయట పడుతున్నాయని, దీంతో కొన్ని దేశాలు దిగుమతులకు నిరాకరిస్తున్న విషయాన్ని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు.

✅ మార్కెట్‌లో సేంద్రియ ఉత్పత్తుల పేరుతో పలు రకాల ఉత్పత్తులు విక్రయిస్తున్నారని, అధిక ధరలు చెల్లించి ప్రజలు వాటిని కొనుగోలు చేస్తున్నప్పటికీ అవి నిజంగా సేంద్రియ ఉత్పత్తులేనా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సరైన వ్యవస్థలు లేవని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

✅ కల్తీల నిరోధానికి సమగ్ర చట్టాలు అమలులో ఉన్న దేశాలను సందర్శించి అక్కడి విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి గారు అధికారులకు సూచించారు. ఆయా అధ్యయనాల ఆధారంగా సమగ్ర నివేదికను రూపొందించాలని ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా బిల్లును రూపొందించి శాసనసభలో సమగ్ర చర్చ చేపడతామని ముఖ్యమంత్రి గారు తెలిపారు. శాసనసభలో చర్చతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు కూడా స్వీకరించాలని సూచించారు.

✅ కల్తీలకు సంబంధించి సమగ్ర సమాచారం సేకరించేందుకు విజిల్ బ్లోయర్ వ్యవస్థను, టోల్ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు.

✅ కల్తీల నిరోధానికి ముందుగా క్యూర్ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అధికారులను ఆదేశించారు. అక్కడ నిబంధనలను అమలు చేసి, వాటి అమలులో ఎదురయ్యే లోటుపాట్ల ఆధారంగా ముందుకు సాగాలని సూచించారు.

✅ ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు గారు, రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ గారు, ముఖ్యమంత్రి సలహాదారు, ఎక్స్ అఫీషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీ కె.రామకృష్ణారావు గారు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు వి.శేషాద్రి గారు, ఎన్.శ్రీధర్ గారు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Hon’ble Chief Minister Sri A. Revanth Reddy directed officials to formulate a stringent law to prevent food and drug adulteration. Reviewing the Telangana Food Adulteration and Drug Control Act (TGFADCA) at MCR HRD Bodhi Pavilion, the Chief Minister stated that adulteration of essentials, vegetables, fruits, and milk is affecting public health.

🔹 The Chief Minister directed officials to study the practices of countries with comprehensive anti-adulteration laws, prepare a detailed report, and draft a bill for discussion in the Legislative Assembly along with seeking public feedback.

🔹 He instructed officials to establish a whistleblower system and toll-free number for collecting information related to adulteration and take the CURE region as a pilot project for implementing preventive measures.

🔹 The meeting was attended by Chief Secretary Sanjay Jaju, DGP C.V. Anand, Chief Minister’s Advisor & Ex-Officio Special Chief Secretary K. Ramakrishna Rao, CM’s Principal Secretaries V. Seshadri and N. Sridhar, and senior officials from various departments.