ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, అందుకే ఉద్యోగులకు బీమా రక్షణ కల్పించామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు చెప్పారు.

“సింగరేణి, విద్యుత్, ఆర్టీసీ.. ఏదైనా అందరికీ ప్రభుత్వమే యజమాని. ఉద్యోగుల్లో విశ్వాసం, నమ్మకం కలిగించడమే కాకుండా భద్రత కలిపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. అందుకే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు అడగకపోయినా వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది” అని అన్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం బీమా సౌకర్యం కల్పించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు ఇతర మంత్రులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగుల బీమా రక్షణ కల్పించడానికి సంబంధించి వివిధ బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందాలు చేసుకుంది.
ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వమంటే ఒక నమ్మకం. ప్రభుత్వంలో బాధ్యతలు నిర్వర్తించడమంటే సంపూర్ణమైన భద్రత. సింగరేణి కార్మికులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా కోటి రూపాయల బీమా కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించినప్పుడు నమ్మకం కుదరలేదు. కానీ సాధ్యమని నిరూపించారు.
ఏ సంస్థ కోసమైతే రెక్కలు ముక్కలు చేసుకుని పనిచేస్తున్న కార్మికుడు ఊహించని ప్రమాదంలో చనిపోయినప్పుడు ఆ సంస్థ కోటి రూపాయల సహాయం అందించడానికి అండగా నిలబడినప్పుడు ఆ కుటుంబం సమాజంలో తలెత్తుకుని నిలబడగలుగుతుంది.
మన పట్ల సానుభూతి, సానుకూలత చూపించేవాళ్లు ఉండొచ్చు. కానీ మన సమస్యలకు ఆర్థికంగా సహాయం చేసే వాళ్లు చాలా అరుదు. అందుకే యజమానియే ఆ బాధ్యత తీసుకోవాలి.
సింగరేణిలో సాధ్యమైనప్పుడు రాష్ట్రంలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యోగులకు బీమా సౌకర్యం కల్పించడం ఎందుకు సాధ్యం కాదు. అందుకే అడక్కపోయినా ప్రభుత్వం బాధ్యతతో ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో లావాదేవీలు నిర్వహిస్తున్న 16 బ్యాంకులను ఆహ్వానించి ఉద్యోగుల సమక్షంలో ఒప్పందాలు చేసుకున్నాం.
పదేళ్లలో ధనిక రాష్ట్రమైన తెలంగాణను రూ. 8.11 లక్షల కోట్ల అప్పులు చేసి అనేక సమస్యలను సృష్టించారు. పదేళ్లలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు. ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉండేది. ప్రజా ప్రభుత్వం బాధ్యత తీసుకున్న తర్వాత విడతల వారిగా జీతాలు ఇవ్వడం కుదరదని చెప్పి మొదటి తారీఖునే చెల్లిస్తున్నాం.
58 సంవత్సరాల రిటైర్మెంట్ వయసును 61 సంవత్సరాలు పెంచడం వల్ల రిటైర్మెంట్లన్నీ 2024 నుంచి మొదలయ్యాయి. ప్రతి నెలా రిటైర్మెంట్ బెనిఫిట్స్ పేరుకుపోయాయి. అయినా ఉద్యోగులను చిన్నచూపు చూడలే. అన్ని ప్రయత్నాలు చేస్తూ నెలకు రూ. 200 కోట్ల నుంచి రూ. 700 కోట్ల మేరకు బెనిఫిట్స్ కోసం చెల్లించాం.
వంద రోజుల్లో రూ. 6 వేల కోట్లు చెల్లిస్తామని చెప్పాం. మొదటి విడతగా రూ. 1000 కోట్లు చెల్లించాం. చెప్పిన మాట ప్రకారం విడతల వారిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులను విడుదల చేస్తున్నాం.
పీఆర్సీ విషయంలో కూడా ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. మీ సోదరుడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అందరం కలిసి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుదాం. రోజులో ఒక గంట అదనంగా పనిచేద్దాం. పన్నులు కట్టకుండా ఎగ్గొడుతున్న వారిని పట్టుకునే బాధ్యత ఉద్యోగులదే. ఆదాయాన్ని పెంచాలి. ఆ ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలకే ఉపయోగిస్తాం.
ప్రభుత్వం నిరుపేదలకు రేషన్ కార్డుల మంజూరు, సన్నబియ్యం పంపిణీ, 47 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 55 లక్షల కుటుంబాలకు రూ. 500 లకే సిలిండర్, నర్సరీ నుంచి 12వ తరగతి వరకు నాణ్యమైన విద్య, బ్రేక్ ఫాస్ట్ స్కీమ్, మహిళా సంఘాల్లో ఆడబిడ్డలకు రూ. 60 వేల కోట్లు బ్యాంకు రుణాల లింకేజీ వంటి పథకాలను అందించడంలో ఉద్యోగుల శ్రమ ఉంది.
ప్రభుత్వ ఇమేజీని పెంచడంలో ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లు. ఉద్యోగులు ఆత్మగౌరవంతో నిలబడాలన్నది మా లక్ష్యం. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత 70 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం. తద్వారా కూడా అదనపు ఆర్థిక భారం ప్రభుత్వంపై పడింది.
మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజినల్ రింగ్ రోడ్డు రాష్ట్రానికి ఎంతో అవసరం. గత పదేళ్లలో ఈ పనులు చేయాలని కొట్లాడినం. ఇప్పుడు మేం చేస్తామంటే కాళ్లల్లో కట్టెలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తెలంగాణ సాధన కోసం సర్వం కోల్పోయిన వారిని గుర్తించి గౌరవించే ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం గడిచిన 30 నెలలు ప్రతిరోజూ 16 నుంచి 18 గంటల పనిచేశా. ఇప్పుడు ప్రణాళికలు ఒక్కొక్కటిగా కొలిక్కి వచ్చాయి. మెట్రో, మూసీ, భారత్ ఫ్యూచర్ సిటీ, కుల గణన, ఎస్సీ వర్గీకరణ.. ఇలా సమస్యలను పరిష్కరించుకుంటూ వస్తున్నాం.
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదు. అక్రమార్కులను కట్టడి చేస్తే ఆదాయం పెరుగుతుంది. రోజుకు ఒక గంట ఎక్కువగా పనిచేయండి. మార్పు తీసుకొద్దాం. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా తెలంగాణను తీర్చిదిద్దుకుందాం. అందుకు మీ అందరి సహకారం కావాలి.. అని ముఖ్యమంత్రి గారు కోరారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, గడ్డం వివేక్ వెంకటస్వామి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, మహమ్మద్ అజారుద్దీన్ గారు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు గారు, డీజీపీ సీవీ ఆనంద్ గారు, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The Telangana Government has announced a major welfare initiative for its employees. The State Government has entered into agreements with various banks to provide insurance coverage to all state government employees.
Hon’ble Chief Minister Sri. A. Revanth Reddy, along with Deputy Chief Minister Sri. Mallu Bhatti Vikramarka and other ministers, participated in a program held at Ravindra Bharathi, Hyderabad, to launch the insurance facility for state government employees.
On this occasion, in the presence of the Chief Minister, the State Government signed Memorandums of Understanding (MoUs) with various banks to provide insurance protection and coverage for government employees.