తెలంగాణ విశాల ప్రయోజనాలే లక్ష్యంగా పని చేయాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు రాష్ట్రానికి చెందిన పార్లమెంట్ సభ్యులకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు.

నీటి పారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతుల సాధనపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి గారు కోరారు. ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇచ్చారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి గారు, ఎంపీలు మల్లు రవి గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, ఈటల రాజేందర్ గారు, కుందూరు రఘువీర్ రెడ్డి గారు, కడియం కావ్య గారు, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, రఘురాం రెడ్డి గారు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారితో పాటు అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, దేశ జనాభాలో 10 శాతం జనాభా ఆరు మహా నగరాల్లో హైదరాబాద్ ఉందని, ఈ నగరాలు 25 శాతం జీడీపీ కలిగి ఉన్నాయని తెలిపారు. హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి అవసరమని, ఎంపీలు ఈ విషయంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞప్తి చేయాలని సూచించారు.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-I స్వాధీనం, మెట్రో ఫేజ్-II విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చల సరళిని ఎంపీలకు వివరించారు. ఇందుకు సంబంధించి SBICAPS ని కన్సల్టెంట్గా నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని, ఆ ప్రక్రియ త్వరగా ముందుకు సాగేలా చూడాలని కోరారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్ గారికి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.
రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో 95 శాతం భూ సేకరణ పూర్తయిందని, ఆ పనుల ప్రారంభానికి, దక్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేకరణకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. ఈ విషయంలో కూడా ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ చూపించాలని కోరారు.
మూసీ పునరుజ్జీవనం పనుల్లో మొదటి దశ టెండర్ల దశకు వచ్చిందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. ఈ పనులను అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విషయంలో కేంద్ర అప్రూవల్ లెటర్ ఇవ్వాల్సి ఉందన్నారు. ఎంపీలు ఈ విషయంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ గారిని కలిసి విజ్ఞప్తి చేయాలని సూచించారు.
అంతరాష్ట్ర నదీ జలాల విషయమై ఇటీవల కర్ణాటకలో జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్ గారి ఆధ్వర్యంలో ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రులతో చర్చించిన అంశాలను ఎంపీలకు వివరించారు. తుంగభద్ర నుంచి తెలంగాణకు 15.09 టీఎంసీల నీరు రావలసి ఉన్నా పూడికతో 5 టీఎంసీలకు మించి రావడం లేదన్నారు. డ్యామ్తో పాటు కాలువల్లో పూడిక తొలగింపునకు ఏపీ, కర్ణాటక సహకరించేలా ఒప్పించాలని కేంద్ర మంత్రిని కోరామని, ఈ విషయంపై ఎంపీలు కేంద్ర మంత్రిని కలసి పరిష్కారమయ్యేలా చూడాలన్నారు.
నదుల అనుసంధానంలో గోదావరి నుంచి నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకునే విషయంలో ఛత్తీస్గఢ్ను ఒప్పించే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి గారు తెలిపారు. గోదావరిలో ఛత్తీస్గఢ్కు 300 టీఎంసీల వాటా ఉందని, వాటిని ఛత్తీస్గఢ్ వాడుకోవడం లేదన్నారు. భవిష్యత్లో 160 టీఎంసీలు వాడుకున్నా 143 టీఎంసీలు మిగులు ఉంటాయన్నారు. అందులో తెలంగాణకు 43 టీఎంసీలు లభించే అవకాశం ఉందన్నారు.
గోదావరి నుంచి ఏపీ ప్రాంతం మీదుగా తమిళనాడు, కర్ణాటక, కేరళకు నీరు తీసుకెళ్లే గోదావరి-కావేరి అనుసంధానం ఉందన్నారు. ఈ విషయంలో ఎంపీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఇక్కడ నీళ్లు ఛత్తీస్గఢ్ వి అయితే నిధులు కేంద్రానివని, ఆ రెండింటిని తెలంగాణకు అనుకూలంగా సాధించాలని చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రారంభించిన ప్రాజెక్టులకు ఏపీ నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీ) ఇవ్వాల్సి ఉందని ముఖ్యమంత్రి గారు గుర్తుచేశారు. ఈ విషయంపైనా కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ గారు, ఏపీ ముఖ్యమంత్రి గారితో చర్చించామన్నారు. వారు సూత్రప్రాయంగా అంగీకరించారని, ఎన్వోసీలు వస్తే వాటికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని చెప్పారు.
తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుకు సంబంధించి 150-151 అడుగుల్లో నిర్మించేందుకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారితో భేటీ అవుదామని ఎంపీలకు సూచించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు, చెన్నై, ముంబయిలకు వెళ్లే బుల్లెట్ రైళ్లకు సంబంధించి ఎలైన్మెంట్లు కొలిక్కివచ్చాయని సమావేశంలో వివరించారు. ఆదిలాబాద్ ఢిపెన్స్ ఎయిర్పోర్ట్, వరంగల్ ఎయిర్పోర్ట్లకు అవసరమైన భూ సేకరణ పూర్తి చేశామని తెలిపారు. ఈ ఎయిర్పోర్టుల్లో ఎంఆర్వో (మెయింటెనెన్స్, రిపేర్స్, ఓవర్ హాలింగ్), ఎయిర్ కార్గోలు ఏర్పాటు చేయాలని కోరుతున్నామని, ఈవిషయంపైనా ఎంపీలు దృష్టిసారించాలని కోరారు.
రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు. పార్టీలకు అతీతంగా ఎంపీలకు అవసరమైన సమాచారం అందించడానికి ఢిల్లీ తెలంగాణ భవన్లో కోఆర్డినేషన్ కు ఐఏఎస్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ను నియమించిన విషయాన్ని ప్రస్తావించారు. పెండింగ్ అంశాలకు సంబంధించి ఏ సమాచారం కావాలన్నాఆయన దగ్గర నుంచి తీసుకోవచ్చని సూచించారు.
అన్ని పార్టీల ఎంపీలను సమన్వయం చేసుకొని ముందుకు సాగాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సీఎం సూచించారు. సమావేశంలో ఎంపీలు పలు అంశాలను ప్రస్తావించారు.
Hon’ble Chief Minister Sri A. Revanth Reddy emphasized the need for Telangana MPs to work together, beyond political affiliations, to advance the state’s development agenda and secure pending approvals from the Central Government.
Ahead of the upcoming Parliament session, the Chief Minister gave a detailed presentation to MPs at Mahatma Jyotiba Phule Praja Bhavan on key issues requiring Central support, including the establishment of an IIM in Hyderabad, Hyderabad Metro Phase-II expansion, Regional Ring Road (RRR), Musi Revival, airport development in Warangal and Adilabad, MRO and air cargo facilities, and proposed bullet rail connectivity from Hyderabad to Bengaluru, Chennai and Mumbai.
The CM also discussed critical water and irrigation matters, including Tungabhadra desiltation, Godavari–Nagarjuna Sagar river-linking, the Godavari–Cauvery linkage project, pending NOCs for irrigation projects from Andhra Pradesh, and the Tummidihatti project with Maharashtra. He sought MPs’ cooperation in engaging with the Centre to expedite approvals, funding, clearances, and policy decisions vital to Telangana’s growth.
Reiterating that the State Government is working with the Centre in the interest of Telangana, the Chief Minister called for coordinated efforts by MPs from all parties to resolve pending issues and accelerate the implementation of key development and infrastructure projects.
